డీసీఎం రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు 

dcm pavan

కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని…” ప్రత్యేకించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీ పడరు.. చేతల్లో ఆలస్యం చేయరు..ఈ క్రమంలోనే ఆయన రెండు రోజుల రాజమహేంద్రవరం పర్యటన దశాబ్దాల కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు.పరిశ్రమల లాభాల కంటే.. ప్రజల ఆరోగ్యమే పరమావధిగా భావించిన ప్రజా నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ అని మంత్రి దుర్గేష్ అన్నారు. కేవలం వచ్చే పుష్కరాల కోసమే కాదు.. రాబోయే తరాల పర్యావరణ భద్రత కోసం ఆలోచించే దూరదృష్టి ఉన్న ఏకైక నాయకుడు మన డిప్యూటీ సీఎం అని ఆయన వివరించారు.పదవి అంటే అధికారం కాదు.. ప్రజల పట్ల జవాబుదారీతనం అని విజన్ ఉన్న నాయకుడు సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో తన మార్క్ యాక్షన్‌తో  జననేత పవన్ కళ్యాణ్ నిరూపించారని మంత్రి కందుల దుర్గేష్ ఆయన రెండు రోజుల రాజమహేంద్రవరం పర్యటన విశేషాలు తద్వారా వచ్చిన మార్పులను స్పష్టంగా సోమవారం ఓక ప్రకటనలో  వివరించారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  రెండు రోజుల రాజమహేంద్రవరం పర్యటన రాష్ట్రంలో సరికొత్త పర్యావరణ విప్లవానికి నాంది పలికిందని, మాటల కంటే పనుల వేగం ఎలా ఉంటుందో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  తన కార్యాచరణతో నిరూపించారని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. పర్యటన ముగిసిన కేవలం 24 గంటల వ్యవధిలోనే రాష్ట్రంలోని ప్రధాన నదుల కాలుష్య నివారణే లక్ష్యంగా అత్యున్నత స్థాయి ‘ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిబద్ధతకు, శరవేగపు పనితీరుకు నిదర్శనమని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.ఆయన స్పీడ్ చూసి అధికార, రాజకీయ యంత్రాంగమే అబ్బురపడిందన్నారు.

సమాజాన్ని కదిలించిన ప్రశ్న 

రాబోయే 2027 గోదావరి పుష్కరాలకు దాదాపు 10 కోట్ల మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, ఈ క్రమంలో “భక్తులు నదిలో రసాయనాల స్నానం చేయాలా? పవిత్ర స్నానం చేయాలా?” అని డిప్యూటీ సీఎం లేవనెత్తిన ప్రశ్న యావత్ సమాజంతో పాటు అధికార యంత్రాంగాన్ని తీవ్రంగా ఆలోచింపజేసిందని మంత్రి దుర్గేష్ అన్నారు. “స్వయంగా పడవపై వెళ్లి గోదావరి కన్నీటిని చూశారని.. నల్ల ఛానల్ కాలుష్యాన్ని కడిగేసేలా, ఆంధ్ర పేపర్ మిల్స్ పరిశ్రమల నుండి వచ్చే పరిశ్రమల రసాయన వ్యర్థాలు, నగర మురుగునీరును ప్రజానీకానికి చూపించారన్నారు.  ఓ వైపు పవిత్ర గోదావరి నదిలో రసాయనాలు కలవడంపై  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూనే.. 24 గంటల్లోనే ఆ ప్రాంతాలను శుభ్రం చేయించడం ఒక అద్భుతమని మంత్రి పేర్కొన్నారు. పుష్కరాలకు వచ్చే ప్రతి భక్తుడికి పవిత్రమైన, స్వచ్ఛమైన గోదావరి జలాల్లో స్నానం చేస్తున్నామనే ఆధ్యాత్మిక అనుభూతి కలగాలే తప్ప, మురుగు నీటిలో స్నానం చేస్తున్నామనే భావన రాకూడదన్నదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పమని వివరించారు.ఆయన వేసిన ప్రతి అడుగు.. కాలుష్య రహిత గోదావరికి ఒక మైలురాయిగా పేర్కొన్నారు. త్వరలోనే గోదావరి నదిపై సమగ్ర ‘పొల్యూషన్ ఆడిట్’చేయడంతో పాటు పర్యావరణ ప్రమాణాలు ఉల్లంఘిస్తే ఎంతటి పరిశ్రమనైనా ఉపేక్షించమని మంత్రి దుర్గేష్ అన్నారు.

‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలకు  మాస్టర్ ప్లాన్:

కాలుష్య రహిత గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం ‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ పేరిట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక పక్కా కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.ఈ నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆరు జిల్లాల పరిధిలో 262 పంచాయతీలను గుర్తించి, వాటిని మురుగురహితంగా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభమయ్యాయన్నారు. గ్రామాలు, పట్టణాల్లో మురుగు నిర్వహణతో పాటు పారిశ్రామిక కాలుష్య పర్యవేక్షణకు RTGS (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) తరహా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణ చేపట్టనున్నారని, ఈ బాధ్యతను నూతన టాస్క్ ఫోర్స్‌కు అప్పగించనున్నట్లు మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఈ పనుల కోసం కాలుష్య నియంత్రణ మండలి (PCB) కేటాయించిన రూ. 100 కోట్ల నిధులతో పాటు, అవసరమైతే వీబీజీ రాంజీ, స్వచ్ఛాంధ్ర నిధులను కూడా దశలవారీగా వినియోగిస్తారని పేర్కొన్నారు. ”  

 

భయాందోళన కలిగిస్తున్న కాలుష్య గణాంకాలు – తక్షణ నివారణ చర్యలు:

కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పరిశీలనలో తేలిన అంశాలపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.. ఆరు జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీల నుంచి రోజుకు సుమారు 104 మిలియన్ లీటర్ల మురుగునీరు, గ్రామీణ ప్రాంతాల నుంచి 8.38 మిలియన్ లీటర్ల మురుగునీరు గోదావరిలో కలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఆంధ్ర పేపర్ మిల్స్ నుంచే రోజుకు 32 మిలియన్ లీటర్ల వ్యర్థాలు, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి నిత్యం 13.24 మిలియన్ లీటర్ల ఆక్వా కాలుష్యం నదిలోకి చేరుతోందని దీనికి చెక్ పెట్టాల్సిన అవసరాన్ని వివరించారు.. ప్రధాన పట్టణాలైన రాజమహేంద్రవరం (రోజుకు 75 మిలియన్ లీటర్ల మురుగు ఉత్పత్తి కాగా 50 మిలియన్ లీటర్లు నేరుగా నదిలోకి), తణుకు (11.1 మిలియన్ లీటర్లు), భీమవరం (14 మిలియన్ లీటర్లు), నరసాపురం (8.5 మిలియన్ లీటర్లు), కొవ్వూరు (6 మిలియన్ లీటర్లు) వ్యర్థ జలాలను యనమదుర్రు, గోస్తనీ డ్రెయిన్ల ద్వారా నదిలోకి వదులుతున్నారని ఈ నేపథ్యంలోనే పట్టణ ప్రాంతాల మురుగునీటిని వంద శాతం శుద్ధి చేసిన (STPల ద్వారా) తర్వాతే నదిలోకి వదలాలని స్పష్టమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారన్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  ఆలోచనల ప్రకారం కేవలం తాత్కాలికంగా కాకుండా, శాశ్వత పర్యావరణ రక్షణ కోసం క్రింది చర్యలు తీసుకోనున్నారని మంత్రి దుర్గేష్ వివరించారు. కొత్తగా ఏర్పాటైన అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రతి 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా సమావేశమై క్షేత్రస్థాయి పరిశీలన చేస్తుందని స్పష్టం చేశారు. అంతేగాక వీబీజీ రాంజీ పథకం కింద మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం, బ్లాక్ వాటర్ నిర్వహణ కోసం సామాజిక ఇంకుడు గుంతలు, ‘ఇండివిడ్యువల్ హౌస్ హోల్డ్ ట్విన్ పిట్స్’ నిర్మించనున్నట్లు తెలిపారు. పంచాయతీ సిబ్బందితో నిరంతర పర్యవేక్షణా బృందాలు పనిచేస్తాయని తద్వారా శాశ్వత పరిష్కారానికి అడుగులు పడ్డాయన్నారు.

డిప్యూటీ సీఎం ఆదేశాలతో గోదావరి పరివాహక మున్సిపాలిటీలన్నింటిలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగంపై దశలవారీ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయనున్నామన్నారు. అధికార యంత్రాంగం పర్యావరణహిత ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తుందన్నారు. అంతేగాక  వాయు, ద్రవరూప కాలుష్య నివారణకు పారిశ్రామిక వర్గాలు ఆధునిక సాంకేతికతతో కూడిన శుద్ధి వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని, పరిశ్రమల పరిసరాల్లో పచ్చదనాన్ని పెంపొందించాలని డిప్యూటీ సీఎం చేసిన దిశానిర్దేశం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసిందన్నారు. నాయకుడు అన్న మాటలో ఆగ్రహం కంటే గోదావరి మాతపై భక్తి, ప్రజలపై ఉన్న బాధ్యతే కనిపించిందని.. ఆయన మందలింపు కూడా వ్యవస్థను పరుగులు పెట్టించేందుకేనని, ఆ చొరవ వల్లే దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యకు 24 గంటల్లోనే చారిత్రాత్మక పరిష్కారం లభించిందని మంత్రి దుర్గేష్ కొనియాడారు