వణికిన జపాన్.. విలవిల్లాడిన వెనిజులా
ప్రపంచవ్యాప్తంగా భూకంపాల భయం మరోసారి ప్రజలను కలవరపెట్టింది. గురువారం జపాన్, వెనిజులా దేశాల్లో సంభవించిన భూకంపాలు ఆందోళన రేకెత్తించాయి. జపాన్ ఈశాన్య ప్రాంతంలో 6.9తో భూకంపం వచ్చింది. వెనిజులా లో వరుసగా 7.2, 7.5 తీవ్రతలతో రెండు శక్తివంతమైన భూకంపాలు వచ్చాయి.
జపాన్ ఈశాన్య ప్రాంతంలో సంభవించిన భూకంపం కారణంగా ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రైలు సేవలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడగా, అధికారులు వెంటనే అప్రమత్తమై పరిస్థితిని పర్యవేక్షించారు. సునామీ ముప్పు లేదని ప్రకటించడంతో ప్రజలు కొంత ఊరట పొందారు.
అదే సమయంలో వెనిజులాలో వరుసగా సంభవించిన రెండు శక్తివంతమైన భూకంపాలు భారీ విధ్వంసానికి దారితీశాయి. ఇప్పటి వరకు 32 మంది మరణించగా, 700 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. భవనాలు కూలిపోవడం, రహదారులు దెబ్బతినడం, విద్యుత్ వ్యవస్థలు స్తంభించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. అనేక మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు సమాచారం. సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
రాజధాని కారాకస్తో పాటు పలు ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పాఠశాలలు, కార్యాలయాలు మూసివేయగా, అత్యవసర పరిస్థితిని ప్రకటించి ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేసింది.
