– ప్యాలెస్ ప్రత్యేకతలు ఇవే!
భారతదేశం ఎన్నో అద్భుతమైన రాజభవనాలకు నిలయం. వాటి ప్రత్యేకత కేవలం భారీ నిర్మాణాల్లోనే కాదు.. అద్భుతమైన వాస్తుశిల్పం, చారిత్రక ప్రాధాన్యం, సాంస్కృతిక వైభవంలోనూ కనిపిస్తుంది. భారతదేశంలోని పురాతన రాజభవనం ఏదో తెలుసా? ఇది దక్షిణ భారతదేశంలో ఉంది. అంతేకాదు.. తాజ్మహల్ కంటే కూడా పాతది. ఆ రాజభవనం పద్మనాభపురం ప్యాలెస్. 16వ శతాబ్దానికి చెందిన ఈ రాజభవనం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో పద్మనాభపురంలో ఉంది. దీనిని అప్పటి ట్రావెన్కోర్ పాలకులు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
పూర్తిగా చెక్కతో నిర్మాణం
పద్మనాభపురం ప్యాలెస్ను ప్రత్యేకంగా నిలబెట్టేది దాని నిర్మాణ శైలి. ఈ రాజభవనంలో ప్రధానంగా చెక్కను ఉపయోగించారు. గోడలు, పైకప్పులు, స్తంభాలు, దూలాలు ఇలా అనేక భాగాలను చెక్కతోనే నిర్మించారు. వాలుగా ఉండే పైకప్పులు, సున్నితమైన చెక్క చెక్కిళ్లు, సంప్రదాయ కేరళ వాస్తుశిల్పం ఈ ప్యాలెస్కు ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చాయి. నేల నిర్మాణంలో ప్రధానంగా సున్నాన్ని ఉపయోగించారు. సుమారు 6.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్యాలెస్ ఆసియాలోని అతిపెద్ద చెక్క రాజభవనాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దీనిని కల్కుళం ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం దీనిని కేరళ ప్రభుత్వం నిర్వహిస్తోంది.
ప్యాలెస్లోని ప్రత్యేక నిర్మాణాలు
రాజభవన సముదాయంలో అనేక చారిత్రక నిర్మాణాలు ఉన్నాయి. వాటిలో థాయ్ కొట్టారం అత్యంత పురాతనమైన భాగంగా చెబుతారు. నాలుగు వైపులా గదులు, మధ్యలో విశాలమైన ఆవరణ ఉండేలా దీనిని నిర్మించారు. ప్యాలెస్ మధ్యలో ఉన్న ఉప్పిరిక్క మాలిక అత్యంత ఎత్తైన నిర్మాణంగా నిలుస్తుంది.
64 ఔషధ మొక్కలతో తయారు చేసిన మంచం
ఈ ప్యాలెస్లోని మరో ఆసక్తికరమైన అంశం మహారాజు ఉపయోగించిన చెక్క మంచం. 64 రకాల ఔషధ మొక్కలతో తయారు చేసిన ఈ మంచాన్ని ‘మెడిసినల్ బెడ్’ గా పిలుస్తారు. మహారాజు నిద్రించేందుకు దీనిని ఉపయోగించేవారని చెబుతారు. ఇక ప్యాలెస్లో నవరాత్రి మండపం అనే ప్రత్యేక నృత్య మందిరం కూడా ఉంది. అప్పట్లో ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు.
అద్భుతమైన కుడ్య చిత్రాలు
ప్యాలెస్లోని కుడ్య చిత్రాలు (మురల్స్) మరో ప్రధాన ఆకర్షణ. చారిత్రక, సాంస్కృతిక అంశాలను ప్రతిబింబించే ఈ చిత్రాలు ఇప్పటికీ మంచి స్థితిలో ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోని అత్యంత చక్కగా సంరక్షించబడిన పురాతన కుడ్య చిత్రాల్లో ఇవి ముఖ్యమైనవిగా భావిస్తారు.
‘పద్మనాభపురం’ అనే పేరు ఎలా వచ్చింది?
ట్రావెన్కోర్కు పూర్వం వేనాడ్ అనే పేరు ఉండేది. వేనాడ్ పాలకుడు ఇరవి వర్మ కులశేఖర పెరుమాళ్ తన అధికారానికి, ప్రతిష్ఠకు ప్రతీకగా ఈ రాజభవనాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. తర్వాత ఆధునిక ట్రావెన్కోర్ రూపకర్తగా గుర్తింపు పొందిన మార్తాండ వర్మ 1744లో దీనికి ‘పద్మనాభపురం’ అనే పేరు పెట్టారు. ‘పద్మనాభుని నివాసం’ అనేది ఈ పేరుకు అర్థం.
నేటికీ సందర్శకులకు అందుబాటులో..
చరిత్ర, వాస్తుశిల్పం, కళలు, కేరళ సంప్రదాయాలను ఒకే చోట చూడాలనుకునే వారికి పద్మనాభపురం ప్యాలెస్ ఒక అద్భుతమైన ప్రదేశం. నేటికీ సందర్శకులను అనుమతించే ఈ చారిత్రక కట్టడం దక్షిణ భారతదేశంలోని ప్రముఖ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా నిలిచింది. తాజ్మహల్ కంటే శతాబ్దాల ముందే నిర్మితమైన ఈ చెక్క రాజభవనం.. భారతీయ వాస్తుశిల్పం, రాజవంశాల చరిత్ర, కేరళ సంప్రదాయ కళలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.
