చైనాలో అరుదైన గుహ నత్త.. ఇప్పటివరకు దొరికింది మూడే!

Natta

చైనాలో శాస్త్రవేత్తలు ఓ అత్యంత అరుదైన మంచినీటి గుహ నత్త జాతిని గుర్తించారు. ఈ చిన్న జీవికి కళ్లు ఉండవు. శరీరంలో దాదాపు రంగు ఉండదు. దాని పారదర్శకమైన, పలుచటి పెంకు ద్వారా లోపలి కణజాలం కూడా కనిపించేంత సున్నితంగా ఉంటుంది. ఇప్పటివరకు ఈ జాతికి చెందిన మూడు జీవించి ఉన్న పెద్ద నత్తలు మాత్రమే శాస్త్రవేత్తలకు లభించాయి.
కొత్తగా గుర్తించిన ఈ జాతికి యర్హియా డిజియాంగ్ అని పేరు పెట్టారు. ఇది నైరుతి చైనాలోని యున్నాన్ ప్రావిన్స్‌లో, యూసీ నగరంలోని హోంగ్టా జిల్లాలో ఓ పర్వత గుహలో కనిపించింది. సూర్యకాంతి అసలు చేరని ఈ గుహలోనే ఈ నత్త జీవిస్తోంది.

చీకటికి తగ్గట్టుగా పరిణామం

యర్హియా డిజియాంగ్ ను ట్రోగ్లోబయాంట్ జీవిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే గుహల్లో మాత్రమే జీవించేందుకు ప్రత్యేకంగా పరిణామం చెందిన జీవి. నిరంతర చీకటిలో ఎన్నో తరాలుగా జీవించడం వల్ల దీనికి కళ్లు, కళ్లకు సంబంధించిన నిర్మాణాలు క్రమంగా కనుమరుగయ్యాయి.
శరీరంలో రంగును కలిగించే పిగ్మెంటేషన్ కూడా దాదాపు లేదు. ప్రయోగశాలలో వెలుతురు చూపించినప్పుడు ఈ నత్తలు వెంటనే దాక్కునేందుకు ప్రయత్నించాయి. రాళ్ల కింద ఉన్న ఇరుకైన ప్రదేశాల్లోకి వెళ్లిపోయాయి.

చైనా పురాణంలోని దేవుడి పేరు

ఈ నత్తకు పేరు పెట్టడంలోనూ ఆసక్తికరమైన కథ ఉంది. పురాతన చైనా గ్రంథం “క్లాసిక్ ఆఫ్ మౌంటైన్స్ అండ్ సీస్’లో ముఖం లేని పర్వత దేవుడిగా వర్ణించిన దీ జియాంగ్ (డి జియాంగ్) పేరు నుంచి యర్హియా డిజియాంగ్ అనే పేరు తీసుకున్నారు. నత్తకు కళ్లు, స్పష్టమైన ముఖ ఆకృతి లేకపోవడంతో ఈ పేరు సరిపోతుందని పరిశోధకులు భావించారు.

2,062 మీటర్ల ఎత్తులో గుహ

ఈ ఆవిష్కరణ మరో విషయంలోనూ ప్రత్యేకమైనదే. ఈ నత్త కనిపించిన గుహ సముద్ర మట్టానికి 2,062 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది యర్హియిదే కుటుంబానికి చెందిన గుహ నత్తల్లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఎత్తు. ఈ ప్రాంతం కార్స్ట్ భౌగోళిక నిర్మాణం కలిగి ఉంది. నీరు క్రమంగా కరిగే రాళ్లను దెబ్బతీయడం వల్ల భూగర్భంలో గుహలు, రహస్య నీటి ప్రవాహాలు, చిన్న నీటి గుంతలు ఏర్పడతాయి. ఇలాంటి ప్రాంతాలు బయటి ప్రపంచం నుంచి వేరుపడిపోవడంతో ప్రత్యేకమైన జీవులు అక్కడ మాత్రమే పరిణామం చెందే అవకాశం ఉంటుంది.

గుహలోనే జీవనం

ఈ నత్తలు గుహలోని ఒక మీటర్ కంటే తక్కువ లోతున్న నీటిలో, చిన్న రాళ్లు మరియు కంకర మధ్య జీవిస్తాయి. అక్కడి నీటి ఉష్ణోగ్రత సుమారు 20 డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది. నీటిలోని రాళ్లపై పెరిగే డయాటమ్స్ అనే సూక్ష్మజీవులను ఇవి ఆహారంగా తీసుకుంటాయి. ప్రయోగశాలలో చేపల ఆహారాన్ని కూడా తిన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

భారీ వర్షాలు కురిసినప్పుడు వేగంగా ప్రవహించే నీరు కొన్ని నత్తలను గుహ ప్రవేశం వైపు కొట్టుకుపోయేలా చేస్తుంది. అయితే గుహ బయట ఉన్న నీటి ప్రవాహాల్లో ఒక్క నత్త కూడా కనిపించలేదు. ఇవి గుహలోనే, ప్రవేశ ద్వారానికి రెండు మీటర్ల పరిధిలోనే ఉండటాన్ని పరిశోధకులు గమనించారు.

మూడు నత్తలే.. భవిష్యత్తుపై ఆందోళన

2025 ఆగస్టులో నిర్వహించిన సర్వేలో శాస్త్రవేత్తలకు మూడు జీవించి ఉన్న పెద్ద నత్తలు, ఒక ఖాళీ పెంకు మాత్రమే లభించాయి. ఒక్క చిన్న నత్త కూడా కనిపించలేదు. దీంతో ఈ జాతి విజయవంతంగా సంతానోత్పత్తి చేస్తోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే గుహకు పరిమితమైన ఈ జాతికి కాలుష్యం, నీటి ప్రవాహంలో మార్పులు, గుహలో మానవ కార్యకలాపాలు వంటి చిన్న మార్పులే పెద్ద ప్రమాదంగా మారవచ్చు. ఆ ఒక్క గుహ దెబ్బతిన్నా ఈ జాతి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. అందుకే చైనాలోని ఇతర గుహల్లోనూ విస్తృతంగా పరిశోధనలు చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇంకా ఎన్నో తెలియని జీవులు భూగర్భ ప్రపంచంలో దాగి ఉండొచ్చని ఈ అరుదైన నత్త ఆవిష్కరణ మరోసారి గుర్తుచేస్తోంది.