మృగశిర కార్తె రాకతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చేపల సందడి మొదలవుతుంది. వర్షాకాలం ఆరంభమయ్యే ఈ పర్వదినాన ప్రతి ఇంట్లోనూ చేపల వంటకాలను వండుకుని తినడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. అయితే, ఈ ఏడాది జూన్ 8న రాబోతున్న మృగశిర కార్తె సందర్భంగా అటు తెలంగాణలో, ఇటు ఏపీలో రెండు విభిన్నమైన, అద్భుతమైన కార్యక్రమాలు జరగబోతున్నాయి.
రెండు ప్రత్యేకతలు
- మృగశిర కార్తెకు హైదరాబాద్లో రోగుల కోసం ప్రతిష్టాత్మక ‘చేప ప్రసాదం’ సిద్ధమవుతుంటే, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పేదల ఆకలి తీర్చడం కోసం ఒక ప్రత్యేకమైన ‘ఆక్వా విందు’కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్లో మృగశిర కార్తె అనగానే అందరికీ గుర్తొచ్చేది బత్తిని కుటుంబం అందించే ‘చేప ప్రసాదం’. దశాబ్దాల కాలంగా వస్తున్న ఈ ఆనవాయితీలో భాగంగా చేప ప్రసాదాన్ని స్వీకరించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాదిమంది ఆస్తమా, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు భాగ్యనగరానికి తరలివస్తారు.జూన్ 8న ప్రారంభం కానున్న ఈ వితరణ కార్యక్రమం కోసం ఇప్పటికే వందలాది కౌంటర్లను, లక్షలాది చిన్న కొర్రమీను చేప పిల్లలను మత్స్య శాఖ సమకూరుస్తోంది. ఊపిరితిత్తుల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందనే నమ్మకంతో సుదూర ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వస్తుంటారు.సాధారణంగా మృగశిర కార్తె రోజున మార్కెట్లలో చేపల ధరలు విపరీతంగా పెరిగిపోయి ఆకాశాన్ని తాకుతాయి.
- ధనికులు ఎంత ఖర్చు అయినా కొనుగోలు చేస్తారు కానీ, పేద కుటుంబాలు ఆ రోజున చేపలు తినాలనే కోరిక ఉన్నా నిరాశతో వెనుదిరుగుతుంటారు. అలాంటి వారి ఆకలిని, ఆశను గుర్తించిన కొందరు దాతలు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ‘ఆక్వా విందు’కు శ్రీకారం చుట్టారు. మృగశిర రోజున స్థానిక పేదలకు చేపల వంటకాలను రుచి చూపించనున్నారు.
అటు ఆకలి తీర్చడానికి.. ఇటు ఆరోగ్యానికి ..
రకరకాల నాటు చేపల పులుసులు, ఫిష్ ఫ్రైలతో పాటు, గోదావరి స్పెషల్ రొయ్యల ఇగురులతో కూడిన కమ్మని విందు భోజనాన్ని ఉచితంగా వడ్డించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇలా ఒకే రోజున అటు భాగ్యనగరంలో ఆరోగ్యం కోసం, ఇటు ఆంధ్రాలో పేదల ఆకలి తీర్చడం కోసం చేపల వంటకాలు ప్రాధాన్యత సంతరించుకోవడం విశేషం.
