డీఎస్సీ–2025లో సీబీఐ దర్యాప్తు జరపాలి

Jagan

 వైయస్‌ జగన్‌ డిమాండ్‌

తొలి సంతకం అంటూ నానా హడావిడి చేసి టీచర్‌ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ–2025లో గతంలో ఎన్నడూ లేని, వినని విధంగా సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు అక్రమాలకు పాల్పడ్డారని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్షేపించారు. లక్షలాది అభ్యర్థులు, నిరుద్యోగుల నమ్మకాన్ని వమ్ము చేసి, ఇష్టారాజ్యంగా నిర్వహించిన పరీక్ష, అభ్యర్థుల ఎంపికపై సీబీఐతో దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు.  డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాల భర్తీలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, అందుకోసం కొత్తగా జీఓలు తెచ్చారని  జగన్‌ తెలిపారు. తమ పని పూర్తి చేసుకోగానే, మరో మూడు జీఓలు జారీ చేసి, ఆ రెండు కొత్త జీఓలు రద్దు చేశారని వెల్లడించారు. పరీక్ష లేకుండానే, పతకాలు సాధించకున్నా.. కేవలం క్రీడా పోటీలో పాల్గొంటే చాలు అంటూ కొత్త నియమావళిలో ఉద్యోగాలు భర్తీ చేశారన్న ఆయన,  సర్టిఫికెట్స్‌ ఇచ్చిందీ వారే,  ధృవీకరించింది వారే అని గుర్తు చేశారు. ఒక్కో టీచర్‌ పోస్టు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అమ్ముకున్నారన్న ఆయన, దానికి సంబంధించి.. ఒక ఆడియో, వీడియో క్లిప్‌ ప్రదర్శించారు. అందుకే డీఎస్సీ–2025పై సీబీఐ దర్యాప్తు డిమాండ్‌ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జగన్‌ వెల్లడించారు.
ప్రెస్‌మీట్‌లో ఇంకా ఏమేం మాట్లాడారంటే..
డీఎస్సీ పరీక్ష నిర్వహణ విధానం షాకింగ్‌
చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకుని నిర్వహించిన డీఎస్సీ (డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ) పరీక్ష విధానం చూస్తే నిజంగా షాకింగ్‌. అంత అలార్మింగ్‌ లెవల్స్‌లోకి షాక్‌ అనేది పోతుంది. లక్షల మంది అభ్యర్థులు పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబుగారు వమ్ము చేస్తూ, స్కాములు చేస్తూ, ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బ తీసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం.  చంద్రబాబునాయుడుగారు రాగానే తొలి సంతకాలు అంటూ 5 సంతకాలు చేశారు. వఅందులో మెగా డీఎస్సీ కూడా ఒకటి. మెగా అనేది ఏమిటో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే అందులో 6,100 ఉద్యోగాలకు మా ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్‌ ఇచ్చాం. ఆ నోటిఫికేషన్‌ను చంద్రబాబుగారు రద్దు చేసి, ఆ తర్వాత ఆలస్యం కూడా చేసి, అంతకు ముందు మేం ఇచ్చిన ఆ 6,100 పోస్టులు కూడా కలిపి మొత్తంగా ఒక 16 వేల టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్‌లో చివరకు లీకులు చూస్తున్నాం. అక్రమాలు చూస్తున్నాం. స్కాములు చూస్తున్నాం. అవకతవకలు చూస్తున్నాం. మరోవైపు తనంతట తానే సెల్ఫ్‌ సర్టిఫికెట్లు చాలా ఇచ్చుకుంటుంటాడు. రికార్డు అంటాడు. మెగా అంటాడు. రకరకాల పద్ధతులు, రకరకాల మాటలు మాట్లాడతాడు. మెగా డీఎస్సీ పేరుతో ఈయన (చంద్రబాబు) నిర్వహించిన ఈ 16 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ఎంతో మంది ఆవేదనతో ఉన్నారు. మెగా డీఎస్సీ స్కామ్‌లో జరిగిన అక్రమాలు, అవకతవకలను నేను 6 పాయింట్లుగా విభజించి చెబుతాను. ప్రతి పాయింట్‌ లోనూ స్కాము ఎలా జరిగింది, ఏ స్థాయిలో జరిగింది అన్నది వివరిస్తాను.
రికార్డు అంటే ఏమిటో నేను చెబుతా
అయ్యా చంద్రబాబుగారూ రికార్డు అంటే ఏమిటో నేను ఒకసారి చెబుతా తెలుసుకొండి. వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ కనీవినీ ఎరుగని రీతిలో ఒకే నోటిఫికేషన్‌తో ఒకే టైమ్‌లో 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర. అలా ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఎక్కడైనా జరిగిందా? ఒక్క వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగిందని గర్వంగా చెప్పగలుగుతాను. రికార్డు అంటే ఇదీ అని కూడా చెప్పగలుగుతాను.
చంద్రబాబు పాలనంతా లీక్‌ల మయం
అసలు చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్‌ ఎలా ఉంటుందంటే.. చిన్న ఉదాహరణ చెబుతా..
– 1995లో టెన్త్‌ క్లాస్‌ పేపర్‌ లీక్‌
– 1996లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పేపర్‌ లీక్‌
– 1997లో ఇంటర్మీడియట్‌ పేపర్స్‌ లీక్‌
– 2017లో టెన్త్‌ సైన్స్‌ పేపర్‌ లీక్‌
– 2019లో టెన్త్‌ పేపర్‌ లీక్‌
– 2025లో బీఈడీ పేపర్‌ లీక్‌
– 2025లో టెన్త్‌ మ్యాథ్స్‌ పేపర్‌ లీక్‌
ఇప్పుడు డీఎస్సీ. టీచర్ల రిక్రూట్‌మెంట్‌ పేపర్ల లీక్‌
ఇదీ చంద్రబాబు హిస్టరీ. ఏదైనా డబ్బులు సంపాదించడం ఎలా? అందుకోసం పేపర్లు ఎలా లీక్‌ చేయాలి?. ఎలా సొమ్ము చేసుకోవాలి? అనేదే చంద్రబాబు విధానం. అదే ఆయన చరిత్ర. ఇలాంటివన్నీ ఎత్తి చూపితే చంద్రబాబుకు మాత్రం నరాలు తెగిపోయేంత బీపీ. అందుకే ప్రశ్నించిన వారిపై కేసులు, అరెస్టులు, భయపెట్టడం. చంద్రబాబు పాలనలో ఇది రొటీన్‌.
కాక్రోచ్‌లు లేస్తాయి
అయ్యా చంద్రబాబు గారూ. ఇప్పుడు జెన్‌ జీలో ఉన్నాం. జెన్‌ ఆల్ఫా కూడా వచ్చేసింది. నవ్వు ఈ మాదిరిగా తప్పు చేసినాక ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచ్‌లు లేస్తాయి. గుర్తు పెట్టుకో చంద్రబాబూ.. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్‌ అనుకో. ఇన్ని పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టే సీబీఐ దర్యాప్తును అడుగుతున్నాం.
అధికారంలోకి రాగానే న్యాయం చేస్తాం
వారం క్రితం డీఎస్సీ అభ్యర్థులంతా నా వద్దకు వచ్చినప్పుడు వారి తరఫున న్యాయ పోరాటంలో కచ్చితంగా వాళ్లకు తోడుగా ఉంటామని చెప్పాం. అధికారంలోకి రాగానే న్యాయం చేస్తాం.
శుక్రవారం (12వ తేదీ) నియోజకవర్గాల్లో నిరసనలు
రేపు (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో  వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నాం.  దగా పడిన ప్రతీ వర్గాన్ని కలుపుకుంటూ రేపు (12వ తేదీ) ప్రతి నియోజకవర్గం స్థాయిలో ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చాం.
మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..
తప్పు ఒప్పుకోకపోతే.. ఫలితం తప్పదు:
నేను చెప్పినవన్నీ ఎవర్నీ వ్యక్తిగతంగా విమర్శించాలనో, లేకపోతే ఎవరినో ఎత్తి చూపించాలనో కాదు. ప్రతి విషయంలోనూ ఆధారాలతో సహా, వాస్తవాలు, గణాంకాలతో సహా వివరించడం జరుగుతోంది. వాస్తవాలు అంత క్లియర్‌గా ఉన్నప్పుడు సమాధానాలు చెప్పాల్సిన చోట సమాధానం చెప్పకపోగా ఎదురుదాడి చేస్తూ తప్పు జరగనట్టుగా, అబద్ధాన్ని కప్పి పుచ్చుకునే కార్యక్రమం చేస్తే.. అది ఏరోజుకైనా దేవుడు కూడా హర్షించడు, ప్రజలూ హర్షించరు. కచ్చితంగా మొట్టికాయలు వేస్తారు. చంద్రబాబుకు అదే జరుగుతుంది.
కోట్లాది కాక్రోచ్‌ల్లో జగన్‌కూడా ఒకరవుతారు
కాక్రోచ్‌ పార్టీనా, ఇంకోటా అనేది పక్కన పెడితే.. వీళ్లంతా యువత. వీళ్లకు న్యాయం చేయకపోతే గవర్నమెంట్‌ ఏం చేస్తున్నట్టు? గవర్నమెంట్‌ ఇన్ని తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది.
జెన్‌ జీ ఇందులో భాగమే. వారి ఆశలను నువ్వు నిర్దాక్షిణ్యంగా నలిపేస్తే ఆటోమేటిక్‌గా, కోట్ల మంది కాక్రోచ్‌లు వస్తారు. అందులో తానూ ఒకడినవుతానని జగన్‌ వివరించారు.