– భూమి రహస్యాలను బయటపెట్టింది!
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో శత్రు జలాంతర్గాములను గుర్తించేందుకు తయారు చేసిన ఓ పరికరం.. ఆ తర్వాత భూమి అంతర్భాగాల కదలికలను అర్థం చేసుకోవడంలో కీలకమైన సాధనంగా మారింది. అదే ఫ్లక్స్గేట్ మాగ్నెటోమీటర్ . నీటి అడుగున దాగి ఉన్న లోహపు జలాంతర్గాముల వల్ల భూమి అయస్కాంత క్షేత్రంలో ఏర్పడే స్వల్ప మార్పులను గుర్తించేందుకు దీనిని మొదట అభివృద్ధి చేశారు. కానీ యుద్ధం ముగిసిన తర్వాత శాస్త్రవేత్తలు ఇదే సాంకేతికతను సముద్రపు అడుగుభాగాన్ని పరిశీలించేందుకు ఉపయోగించారు.
1936లో మొదలైన ప్రయాణం
ఈ పరికరం మూలాలు 1936లో అభివృద్ధి చేసిన అత్యంత సున్నితమైన అయస్కాంత సెన్సార్ వరకు వెళ్తాయి. భూఅయస్కాంత శాస్త్రవేత్త విక్టర్ వాకియర్ ఆధ్వర్యంలో దీనిని విమానాల్లో ఉపయోగించగలిగేలా చిన్నదిగా, పోర్టబుల్గా మార్చారు. 1941లో ఈ పరికరంతో చేసిన ప్రయోగాలు విజయవంతం కావడంతో అమెరికా నేవీ దృష్టిని ఆకర్షించింది. 1942 డిసెంబర్ నాటికి ఫ్లక్స్గేట్ మాగ్నెటోమీటర్లను విమానాల్లో అమర్చి జలాంతర్గాముల వేటలో ఉపయోగించడం ప్రారంభించారు.
యుద్ధం తర్వాత సముద్రంలోకి
రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత విక్టర్ వాకియర్ స్క్రిప్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓషియోనోగ్రఫీ లో చేరారు. అక్కడ శాస్త్రవేత్తలు ఈ పరికరాన్ని సముద్ర పరిశోధనలకు అనుగుణంగా మార్చారు. 1950లు, 1960ల్లో పరిశోధనా నౌకల వెనుక ఈ మాగ్నెటోమీటర్ను లాగుతూ సముద్రపు అడుగుభాగంలోని రాళ్లలో దాగి ఉన్న అయస్కాంత మార్పులను నమోదు చేశారు. అక్కడే శాస్త్రవేత్తలకు ఊహించని విషయం కనిపించింది.
సముద్రపు అడుగున ‘అయస్కాంత చారలు’
సముద్రపు అడుగుభాగంలోని రాళ్లలో వేర్వేరు అయస్కాంత ధ్రువణతలతో కూడిన పొడవైన చారలు కనిపించాయి. అంతేకాదు, సముద్రపు మధ్యలో ఉన్న భారీ పర్వత శ్రేణులైన మిడ్-ఓషన్ రిడ్జ్లకు ఇరువైపులా ఈ చారలు దాదాపు అద్దంలా ఒకే విధంగా ఉన్నాయి. భూమి అయస్కాంత క్షేత్రం చరిత్రలో ఎన్నోసార్లు తన దిశను మార్చుకుంది. కొత్తగా ఏర్పడిన సముద్రపు అడుగుభాగపు రాళ్లు గట్టిపడేటప్పుడు అప్పటి అయస్కాంత దిశను తమలో రికార్డు చేసుకున్నాయి. దీంతో సముద్రపు అడుగుభాగం నిరంతరం కొత్తగా ఏర్పడుతోందనే సీఫ్లోర్ స్ప్రెడింగ్ సిద్ధాంతానికి బలమైన ఆధారం లభించింది.
ప్లేట్ టెక్టానిక్స్కు కీలక ఆధారం
సముద్రపు మధ్యభాగంలోని రిడ్జ్ల వద్ద భూమి లోపలి నుంచి మాగ్మా పైకి వస్తుంది. అది చల్లబడి కొత్త రాతి పొరగా మారుతుంది. ఆ తర్వాత పాత రాళ్లు ఇరువైపులా దూరంగా కదులుతాయి. ఇలా ఏర్పడిన రాళ్లలో భూమి అయస్కాంత క్షేత్రం మార్పుల రికార్డు వరుసగా నిలిచిపోతుంది. ఫలితంగా సముద్రపు అడుగున అయస్కాంత చారల రూపంలో భూమి గత చరిత్రే నమోదై ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది అప్పటివరకు పెద్దగా అంగీకారం పొందని ప్లేట్ టెక్టానిక్స్ సిద్ధాంతానికి అత్యంత బలమైన భౌతిక ఆధారాల్లో ఒకటిగా మారింది.
1966లో ‘మ్యాజిక్ ప్రొఫైల్’
ఈ ఆధారాల్లో అత్యంత ప్రసిద్ధమైనది 1966లో వెలుగులోకి వచ్చింది. పసిఫిక్–అంటార్కిటిక్ రిడ్జ్ ప్రాంతంలో సేకరించిన అయస్కాంత డేటాను పరిశీలించగా, సముద్రపు అడుగుభాగంలో కనిపించిన చారలు అద్భుతమైన సమానత్వాన్ని చూపించాయి. ఈ ప్రత్యేక డేటా ప్రొఫైల్ను శాస్త్రవేత్తలు ‘మ్యాజిక్ ప్రొఫైల్’ గా పిలిచారు. ఇది సముద్రపు అడుగుభాగం విస్తరిస్తోందనే సిద్ధాంతానికి మరింత బలమైన ఆధారంగా నిలిచింది.
1832లోనే పునాది వేసిన గాస్
అయస్కాంత పరిశోధనకు సంబంధించిన పునాది మాత్రం అంతకంటే చాలా ముందే పడింది. 1832లో జర్మన్ గణిత శాస్త్రవేత్త కార్ల్ ఫ్రెడ్రిక్ గాస్ భూమి అయస్కాంత క్షేత్రం తీవ్రతను ఖచ్చితంగా కొలిచే పద్ధతిని అభివృద్ధి చేశారు.ఆయన రూపొందించిన గణిత పద్ధతులు భూమి అయస్కాంత క్షేత్రాన్ని కేవలం వివిధ ప్రాంతాలతో పోల్చడం కాకుండా, దాని నిజమైన తీవ్రతను నిర్దిష్ట ప్రమాణాల్లో కొలవడానికి మార్గం చూపాయి. శతాబ్దం తర్వాత అభివృద్ధి చెందిన ఆధునిక అయస్కాంత పరికరాలకు ఈ పరిశోధనలు పునాదిగా నిలిచాయి.
జలాంతర్గాముల వేట నుంచి భూమి అన్వేషణ వరకు
ఒకప్పుడు సముద్రంలో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములను గుర్తించేందుకు ఉపయోగించిన పరికరం.. చివరకు సముద్రపు అడుగున దాగి ఉన్న భూమి చరిత్రను బయటపెట్టింది. ఫ్లక్స్గేట్ మాగ్నెటోమీటర్ కేవలం జలాంతర్గాములను గుర్తించలేదు.. భూమి ఖండాలు, సముద్రపు అడుగుభాగాలు ఎలా కదులుతున్నాయో అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలకు కీలకమైన ఆధారాన్ని కూడా అందించింది.
